అమల్లోకి నూతన చట్టాలుకనుమరుగు కానున్న ఐపీసీ, సీఆర్పీసీ
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి.
వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి వచ్చాయి.. వీటిని తేవడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. ”భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారు. దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయచట్టాలు శాశ్వతంగా కనుమరుగుకానున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమేనని తెలిపారు.
సామూహిక అత్యాచారానికి మరణశిక్ష!
ఈ కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాలను, ఉగ్రచర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం.. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది.
సెక్షన్ల కుదింపు
ఐపీఎస్లో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు.ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు.
ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి
క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు.