హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హయత్నగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు, గుడిసెలు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడిపోయాయి. వనస్థలిపురంలో ఈదురుగాలులకు గణేశ్ దేవాలయం ప్రాంగణంలో, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై,రైతు బజర్ సమీపంలో భారీ చెట్లు నెలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదరైంది.
చెట్టు కూలి ఇద్దరు మృతి
మరోవైపు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ఈదురుగాలులో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈదురులులతో కూడిన భారీ వర్షానికి తిమ్మాయిపల్లి-శామీర్పేట్ దారిలో చెట్టు కూలి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. బైక్పై చెట్టు విరిగిపడటంతో నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధనుంజయకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే అతడు చనిపోయాడు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
తీవ్ర తుపానుగా మారిన రెమాల్
ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రెమాల్’ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెమాల్ తీవ్ర తుపాను ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది. ఈ తుపాను ప్రభావంతో గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది.