బాపట్ల టిడిపి ఎంపి అభ్యర్థిగా రాజోలు వాసి, ఎంపి బరిలో మాజీ ఐపీఎస్ గెలుపు దిశగా కృష్ణప్రసాద్
రాజోలు మే 08 :
బాపట్ల టిడిపి,బిజెపి,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గంలోని రాజోలు గ్రామానికి చెందిన తెన్నేటి కృష్ణ ప్రసాద్ కు అవకాశం లభించింది.1960లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు లో జన్మించిన తెన్నేటి కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేశారు. తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్గా, తల్లి విజయలక్ష్మీ స్కూల్ టీచర్గా పనిచేశారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన కృష్ణ ప్రసాద్ పోలీస్ శాఖలో 34 ఏళ్లు పనిచేశారు. ఎన్ ఐ టి వరంగల్ నుంచి బిటెక్ పూర్తి చేసిన కృష్ణప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో కలకపడంలో కీలక పాత్ర పోషించారు. సంజీవని ఆపరేషన్తో మావోయిస్టులను ప్రజా జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. సరెండర్ స్పెషలిస్ట్గా గుర్తింపు పొందారు. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టులను ప్రజాజీవితంలో కలిసేలా ప్రోత్సహించే వారు. 450మందికి పైగా మావోయిస్టుల్ని తిరిగి జనజీవితంలోకి తీసుకొచ్చిన రికార్డు ఉంది. డిసెంబర్ 2009లో ఐజీ పోలీస్ సర్వీసెస్ హోదాలో ఉమ్మడి ఏపీలో 1865 పోలీస్ స్టేషన్లను కంప్యూటర్లతో అనుసంధానించారు. నాలుగు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రెండు రేంజ్ లలో డిఐజిగా విధులు నిర్వర్తించారు.
సీఐడి చీఫ్గా, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈడీగా, ఏపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అడిషినల్ డీజీ బడ్జెట్గా, పోలీస్ అకాడమీలో డైరెక్టర్గా పనిచేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా, వరంగల్, విశాఖ రేంజ్లలో డిఐజిగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్, గుంటూరు ఎస్పీలుగా గతంలో పనిచేశారు. ఉమ్మడి గుంటూరులో భాగమైన బాపట్లలో లోక్సభ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో కృష్ణ ప్రసాద్ అభ్యర్ధిత్వానికి టీడీపీ మొగ్గు చూపింది అని తెలుస్తోంది. సిటింగ్ ఎంపి నందిగామ సురేష్ పై కృష్టప్రసాద్ పోటీలో ఉన్నారు.
*కృష్ణ పుష్కరాల్లో బదిలీ*!
తెన్నేటి కృష్ణప్రసాద్ 2004లో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. కృష్ణ పుష్కరాల నిర్వహణలో ఏర్పాట్లలో లోపాలకు బాధ్యుడిని చేస్తూ అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.కృష్ణా పుష్కరాలకు కొద్ది నెలల ముందు విజయవాడ సీపీగా కృష్ణ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజే ప్రకాశం బ్యారేజీ దిగువున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నదీ స్నానాలకు అనుమతించేందుకు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ దిగువున రివర్ స్లూయిజ్ వంతెనకు సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో జనం తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడమే కారణమని భావించిన ప్రభుత్వం కృష్ణప్రసాద్తో పాటు అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని బదిలీ చేసింది. ప్రభాకర్ రెడ్డి తర్వాతి కాలంలో వైఎస్సార్ కార్యదర్శిగా సిఎంఓలో బాధ్యతలు చేపట్టారు. కృష్ణప్రసాద్ చాలా కాలం లూప్లైన్లో ఉండిపోవాల్సి వచ్చింది.
*పోరు పోటా పోటీ !*
బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల వేట ప్రారంభించారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఎస్సిలకు రిజర్వు అయిన సంతనూతలపాడు నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో చేరింది. వేమూరు నియోజకవర్గం ఎస్సిలకు రిజర్వు కాగా, మిగతావన్నీ జనరల్ స్థానాలు. సిటింగ్ ఎంపి సురేష్పై వ్యతిరేకతఎన్నికల్లో వైసిపి తరఫున ప్రస్తుత ఎంపి నందిగం సురేష్ తిరిగి పోటీ చేస్తున్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎంపి నందిగం సురేష్పై, వైసిపిపై ఓటర్లలో అసంతృప్తి ఉంది. ఎంపిగా సురేష్ ఏ ప్రాంతానికీ ఎలాంటి మేలూ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు.గట్టి పోటీ బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి వైపిపి తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘపతి పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున వేగేశన నరేంద్రవర్మ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలుపొంది మూడో పర్యాయం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వేరే వారికి టికెట్ ఇవ్వాలన్న డిమాండు బాగా వచ్చింది. కానీ కోనకే టికెట్ ఖరారైంది. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు కోనను వ్యతిరేకిస్తూ టిడిపిలో చేరారు. కోన రఘుపతి 2019లో 15 వేల ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపాలన్న థ్యేయంతో షర్మిల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బాపట్లలో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.